వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. రోదసి ప్రయోగాల్లో ఎలాంటి అనుభవంలేని నలుగురు పౌరులను ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’ నింగిలోకి పంపించనున్నది. అమెరికాలోని ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ ప్రయోగం చేపట్టనున్నారు. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్9 రాకెట్… వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ను భూకక్ష్యలోకి తరలించనున్నది. ‘ఇన్స్పిరేషన్ 4’ పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా నలుగురిని అంతరిక్ష విహారానికి తీసుకెళ్లనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్), హబుల్ టెలిస్కోప్ను దాటుకొని వీరి పర్యటన కొనసాగనున్నది. మూడు రోజుల అనంతరం వ్యోమగాములు తిరిగి భూమి మీదకు చేరుకుంటారు. ఈ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్4పేమెంట్స్’ కంపెనీ సీఈవో జేర్డ్ ఐసాక్మాన్ భరిస్తున్నారు.