సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్లోని ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అందువల్లే దేశంలో అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని తెలిపారు. పొరుగుదేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ను కట్టడి చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలోని ఉత్తర కొరియా అనుకూల శక్తుల్ని నిర్మూలిస్తానని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
మార్షల్ లా విధింపుతో ఏర్పడే అసౌకర్యాన్ని సహనంతో భరించాలని ప్రజల్ని కోరారు. వీలైనంత తొందర్లో దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. కాగా, దేశంలో ‘మార్షల్ లా’ విధింపును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్లమెంట్ బయట నిరసనకు దిగాయి. పోలీసులు వారి నిరసనను అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మార్షల్ లా విధింపుతో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుండదు. మీడియాపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది.