న్యూఢిల్లీ, మార్చి 16: దక్షిణ కొరియాలో కరోనా బుసలు కొడుతున్నది. బుధవారం ఒక్కరోజే 4,00,741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దక్షిణ కొరియాలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున 3 లక్షల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలో 23.58 లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియా తర్వాత వియత్నాంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్నది. వియత్నాంలో గడిచిన వారంలో 18 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. చైనాలో బుధవారం 3,290 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా, దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో మళ్లీ మహమ్మారి విజృంభించడానికి ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.