కంపాల, జూన్ 17: ఉగాండాలో ఒక స్కూల్పై కొందరు తిరుగుబాటుదారులు దాడి చేసి మారణకాండను సృష్టించారు. 41 మందిని దారుణంగా చంపివేశారు. ఇందులో 38 మంది విద్యార్థులు కాగా గార్డు, మరో ఇద్దరు స్థానికులు ఉన్నారు. అలయిడ్ డెమోక్రాటిక్ ఫోర్స్ (ఏడీఎఫ్) కు చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.
ఉగాండా జిల్లా కాసెస్లోని లుబురిహా ప్రైవేట్ పాఠశాలపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. ఐదుగురు దుండగులు పాఠశాలపై దాడి చేసి డార్మిటరీకి నిప్పుపెట్టారు. విద్యార్థులను సజీవ దహనం చేయడంతో పాటు కాల్పులు జరిపారు. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పలువురు బెవారా దవాఖానలో చికిత్స పొందుతున్నారని స్థానిక మేయర్ సెల్వెస్ట్ మాపోజ్ తెలిపారు.