వాషింగ్టన్, : భూమి పుట్టుక, అది జీవానికి అనుకూలంగా మారడానికి ఇక్కడి ఉపరితలంపై ఎలాంటి పరిణామాలు సంభవించాయో.. అంగారక గ్రహంపై కూడా అలాంటి చర్యలే జరిగినట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. భూమిపైన ఉన్న అగ్నిశిలలను అంగారక గ్రహంపై కూడా గుర్తించారు. మార్స్పై అగ్ని పర్వతాలు పేలిపోయి పెద్ద పెద్ద అగ్ని శిలలు ఏర్పడ్డాయని అరిజోనా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది.
16 ఏండ్ల క్రితం నాసా పంపిన స్పిరిట్ రోవర్ తీసిన ఫొటోలను విశ్లేషించారు. ఆ రాళ్లను ఒలివైన్ సమ్మేళనానికి చెందిన ‘ఇగ్నిమ్బ్రైట్ అగ్నిశిల’గా పేర్కొన్నారు. అగ్ని పర్వత విస్ఫోటం వల్ల ఈ శిలలు ఏర్పడుతాయని తెలిపారు. గుసెవ్, జెజెరో క్రేటర్ల (అగ్నిపర్వత ముఖ ద్వారాలు) దగ్గర రోవర్ ఈ శిలలను ఫొటో తీసినట్టు తెలిపారు. ప్రస్తుతం పర్సీవరెన్స్ రోవర్ అక్కడే నమూనాలను సేకరిస్తున్నది.
వాషింగ్టన్, : భూమ్మీద సరస్సులు, నదులు, సముద్రాలు, మైదానాలు, ఇసుక దిబ్బలు, కొండలు ఉన్నట్టే శని ఉపగ్రహమైన టైటాన్ మీద కూడా ఇవన్నీ ఉన్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది.
భూమ్మీద ఉన్న సరస్సుల్లో నీళ్లుంటే అక్కడ ద్రవ మీథేన్ ఉంటుందని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ జియాలజిస్టు మాథ్యూ లాపోట్రే తెలిపారు. టైటాన్పై నైట్రోజన్ గాలులు వీస్తాయని, ఈ గాలుల కారణంగా హైడ్రోకార్బన్ దిబ్బలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. శని గ్రహానికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో టైటాన్ అతిపెద్దది.
రెండు కిలోమీటర్ల వెడల్పున్న ఓ గ్రహశకలం గంటకు 50 వేల కి.మీ. వేగంతో భూమికి దగ్గరగా వస్తున్నది. ఆ ఆస్టరాయిడ్ పేరు 1989జేఏ. తన కక్ష్యలో తిరుగుతూ ఈ నెల చివర్లో భూమికి అత్యంత సమీపంగా (40.24 లక్షల కి.మీ. దూరం) రానున్నది. ఈ ఆస్టరాయిడ్ను 1989లో గుర్తించారు.
1996లో కూడా ఇది భూమికి దగ్గరగా వచ్చినా ప్రమాదం జరగలేదు. అయితే ఇది ప్రమాదకరమైందని నాసా పేర్కొంది.