వాషింగ్టన్ /టోక్యో, డిసెంబర్ 26: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. దీని ప్రభావంతో ఆ దేశ తూర్పు ప్రాంతంలో దాదాపు 32 మంది మృతి చెందారు. ఒక్క నయాగరా, ఎరీ కౌంటీల్లోనే 17 మంది చనిపోయారు. మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమై పోయాయి. విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల సర్వీసులను రద్దు చేయాల్సివచ్చింది. బఫెలో ఎయిర్పోర్టులో 43 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అటు.. జపాన్లోనూ మంచు తీవ్రతకు 14 మంది మృత్యువాతపడ్డారు. జపాన్కు ఉత్తరంగా ఉన్న హొకైడో, దక్షిణంగా ఉన్న క్యుషుతో పాటు అర్చిపెలాగో దీవుల్లో మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నది. ఇక్కడ మంచు పొరల స్థాయులు 1.20 మీటర్ల స్థాయికి చేరాయి.