Terrorists : పాకిస్థాన్ (Pakistan) లోని అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi) లో శనివారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. నగరంలోని సింధ్ రేంజర్ల (Sindh Rangers) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయంపైకి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దూసుకొచ్చారు.
స్థావరాన్ని ఢీకొట్టి వాహనాన్ని పేల్చివేసిన వెంటనే మిగిలిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు వెంటనే ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతం మొత్తం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు, కమాండోలను రంగంలోకి దించారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ నుంచి విడిపోయిన ‘జమాత్-ఉల్-అహ్రార్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాకిస్థాన్లో భద్రతా బలగాలపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.