వాషింగ్టన్: నేడు భూమి సమీపం నుంచి ఆరు గ్రహ శకలాలు వెళ్లనున్నాయి. ఇందులో ఒకటి 44,388 కిలోమీటర్ల వేగంతో పాస్ అవుతుందని అమెరికా అంతరిక్ష పరీశోధన సంస్థ (నాసా) తెలిపింది. భూమికి సమీపం నుంచి సూర్యుడి వైపునకు వెళ్తున్న ఈ గ్రహ శకలాలను 2021 VX7, 2021 WE1, 2021 WM2, 2021 XT1, 2021 WL2, 2021 XEగా పేర్కొంది.
ఈ ఆరు గ్రహశకలాలలో అతిపెద్దది 2021 VX7 అని, ఇది 31-70 మీటర్ల మధ్య వ్యాసం కలిగి ఉందని నాసా తెలిపింది. ఆ తర్వాత 2021 WM2 18-39 మీటర్ల పరిమాణంలో ఉందని, 2021 WE1 వెడల్పు 15-33 మీటర్లు కాగా, 2021 XT1 5.2- 12 మీటర్ల మధ్య ఉందని, 2021 XE 4.7-11 మీటర్ల వ్యాసం కలిగి ఉన్నదని వివరించింది.
కాగా, గ్రహశకలం 2021 WM2 గంటకు 44,388 కిలోమీటర్ల వేగంతో భూమికి సమీపంగా వెళ్తుందని నాసా తెలిపింది. ఈ ఆరింటిలో అత్యంత వేగంగా దూసుకొస్తున్న ఈ గ్రహ శకలం 31,50,531 కిలోమీటర్ల దూరం నుంచి భూమిని పాస్ అవుతుందని పేర్కొంది. వీటి కదలికలను నాసా ఎప్పటికప్పుడు గమనిస్తున్నది. వీటి వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేకపోవడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
అయితే, భవిష్యత్తులో ముప్పు వాటిల్లే అవకాశమున్న మరో గ్రహ శకలం ఈ నెల 11న భూమి సమీపంగా వెళ్తుందని నాసా తెలిపింది. 4660 నెరియస్గా పిలిచే ఈ గ్రహ శకలాన్ని మొదటిసారి 1982లో పలోమార్ అబ్జర్వేటరీలో ఎఫ్ఈ హెలిన్ కనుగొన్నట్లు పేర్కొంది.
330 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 11న భూమి నుంచి 39,34,424 కిలోమీటర్ల దూరంలో పాస్ అవుతుందని నాసా వెల్లడించింది. 2031 మార్చి 2న ఇది తిరిగి భూమి సమీపం నుంచి వెళ్తుందని అంచనా వేసింది. కాగా, గ్రహ శకలాన్ని శాటిలైట్తో ఢీకొట్టి మార్గాన్ని మళ్లించి భూమికి ముప్పు తప్పించే తొలి మిషన్ను నాసా ఇటీవల చేపట్టింది.