ఫ్రీటౌన్ : ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకున్నది. ఇంధన ట్యాంకర్ను మరో వాహనం ఢీకొట్టగా.. మంటలు చెలరేగి 91 మంది మృత్యువాతపడ్డారు. పెద్ద ఎత్తున జనం గాయపడగా.. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సియెర్రా లియోన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎన్డీఎంఏ) కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మహ్మద్ లామరానే బాహ్ తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫ్రీటౌన్ నగరంలో రద్దీగా ఉండే జంక్షన్ వద్ద భారీ ఆయిల్ ట్యాంకర్ను మరో వాహనం ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది.
దీంతో ఆయిల్ చుట్టు పక్కలన్న దుకాణాలు, మార్కెట్ స్టాల్స్, వీధుల్లో నడుస్తున్న జనంపై పడింది. ఈ క్రమంలో మంటలు అంటుకోవడం అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ఘటనపై ప్రెసిడెంట్ జూలియస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. పది లక్షల మందికిపైగా నివసించే ఫోర్ట్ సిటీ ఇటీవల సంవత్సరాల్లో అనేక విపత్తులను ఎదుర్కొంది. మార్చిలో నగరంలోని మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం జరుగ్గా ఐదువేల మంది నిరాశ్రయులయ్యారు. 2017లో భారీ వర్షాలకు వేలాది మంది నిరాశ్రయులవగా.. వెయ్యికి మందికిపైగా మరణించారు.