న్యూయార్క్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ట్విట్టర్ సీఈవోగా ఉండాలా? వద్దా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఈ విషయమై ట్విట్టర్లో పోల్ నిర్వహిస్తున్నారు. ‘ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా? వద్దా?. ఎలాంటి ఫలితం వచ్చినా, దానికి కట్టుబడి ఉంటా. మీరు ఏం కోరుకుంటే, అదే జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా కోరుకోండి. భవిష్యత్తులో కీలక విధానాల మార్పులపై పోల్స్ నిర్వహిస్తా.’ అని మస్క్ ట్వీట్ చేశారు. సాయంత్రం 4.30 గంటల వరకు ఈ పోల్ జరుగనుంది.
Should I step down as head of Twitter? I will abide by the results of this poll.
— Elon Musk (@elonmusk) December 18, 2022
అయితే ఈ ఓటింగ్లో మస్క్కు ప్రతికూలంగానే స్పందన వస్తున్నది. ఇప్పటిరకు సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని 57.6 శాతం మంది అంటే, నో అని 42.4 శాతం మంది అన్నారు. సాయంత్రం వరకు ఓటింగ్ ఇలాగే కొనసాగితే ట్విట్టర్ సీఈఓగా మస్క్ తప్పుకుంటారో లేదో చూడాలి..!
Going forward, there will be a vote for major policy changes. My apologies. Won’t happen again.
— Elon Musk (@elonmusk) December 18, 2022
ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత మైక్రో బ్లాగింగ్ సైట్లో మస్క్ అనేక మార్పులు తీసుకొచ్చారు. వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అనేక విధానాలను మార్చేశారు. తాజాగా తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను కూడా తొలగించారు. దీంతో ఆయనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.