Brazil firing | బ్రెజిల్లోని రెండు పాఠశాలల్లోకి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థి మృతి చెందారు. మరో 11 మంది గాయపడినట్లు సమాచారం. ఎస్పిరిటో శాంటో రాష్ట్రంలోని అరక్రూజ్ నగరంలో ఈ దాడి జరిగింది. దాదాపు 16 ఏండ్ల వయసున్న దుండగుడు సెమీ ఆటోమేటిక్ గన్తో స్కూల్లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ముఖానికి మాస్క్ వేసుకుని సైనిక దుస్తులు ధరించాడు. కాగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు పాల్పడిన వ్యక్తి తండ్రి పోలీసుగా పనిచేస్తున్నాడని, అతడి తుపాకీ తీసుకువచ్చి కాల్పులు జరిపాడు. నిందితుడి వద్ద రెండు తుపాకులు ఉన్నాయి. వీటిలో ఒకటి సర్వీస్ గన్, మరొకటి ప్రైవేట్ గన్. స్కూల్ తాళం పగులగొట్టి, కాపలాదారుల నుంచి తప్పించుకుని లోనికి ప్రవేశించాడు. ప్రిమో బిట్టి స్కూల్, ప్రియా డి కోక్యురల్ ఎడ్యుకేషనల్ సెంటర్లోకి ప్రవేశించిన దుండగుడు రావడంతోనే విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. ఈ దాడిలో ముగ్గురు చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు.
దాడి చేసిన వ్యక్తి బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించి ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కాల్పులు ఎందుకు జరిపాడన్నది ఇంతవరకు తెలియరాలేదు. ఎస్పిరిటో శాంటో గవర్నర్ రెనాటో కాసాగ్రాండే ఈ దాడిని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు. వీరి మృతికి మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. 2019 లో ఇదే మాదిరిగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మంది స్కూల్ చిన్నారులు చనిపోయారు.