Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా కేసులో తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను రద్దు చేయాలంటూ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ చీఫ్ ఇమ్రాన్ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం కోర్టు తోసిపుచ్చింది. అదనపు సెషన్స్ జడ్జి జాఫర్ ఇక్బాల్ కేసును విచారించిన అనంతరం తీర్పును రిజర్వ్
చేశారు. విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు అలీ బుఖారీ, కైజర్ ఇమామ్, గోహర్ అలీఖాన్ వాదనలు వినిపించారు. ఇమ్రాన్ ఖాన్ హాజరు కావడానికి సిద్ధంగా ఉంటే.. పోలీసులు అతన్ని అరెస్టు చేయలేరని వాదించారు. వారెంట్ సస్పెన్షన్ కోసం పీటీఐ చీఫ్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించవచ్చని న్యాయమూర్తి తెలిపారు.
అయితే, వారెంట్ను సస్పెండ్ చేయాలని సెషన్స్ కోర్టును కోరుతున్నట్లు ఇమ్రాన్ తరఫు న్యాయవాది తెలిపారు. పీటీఐ చీఫ్ లాహోర్లోని జమాన్ పార్క్ నివాసంలో ఉన్నారని బుఖారీ తెలిపారు. కోర్టుకు ఎలా హాజరు కావాలో తెలియాల్సి ఉదని, వారెంట్ను సస్పెండ్ చేయాలని సెషన్స్ కోర్టును కోరుతున్నట్లు ఇమామ్ పేర్కొన్నారు. అనంతరం పిటిషన్పై నిర్ణయాన్ని న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. గైర్హాజరవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ వారెంట్ను ప్రాసెస్ చేసేందుకు ఆదివారం ఇస్లామాబాద్ పోలీసుల బృందం ఎస్పీ నేతృత్వంలోని జమాన్ పార్క్కు చేరుకున్నా.. చివరకు అరెస్టు చేయలేకపోయారు. ఆ తర్వాత ఇమ్రాన్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.