టోక్యో: జపాన్ ప్రజలు షాక్లోకి వెళ్లిపోయారు. కఠినమైన గన్ చట్టాలు ఉన్న ఆ దేశంలో ఇవాళ పేలిన తుపాకీ ఆ దేశ మాజీ ప్రధానిని బలితీసుకున్నది. 41 ఏళ్ల ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో షింజో అబే ప్రాణాలు కోల్పోయాడు. నిజానికి జపాన్లో కాల్పులకు సంబంధించిన ఘటనలు చాలా అరుదు. గన్ హింసకు అక్కడ చోటేలేదు. వాస్తవానికి జపాన్లో ఆయుధాన్ని లీగల్గా సొంతం చేసుకోవడం కష్టం. ప్రభుత్వ క్లియరెన్స్ అంత ఈజీగా దక్కదు. కొన్ని మినహాయింపులు మినహా ఆయుధాలు కొనలేం. అయితే వేట కోసం జపనీయులు ఎక్కువగా ఆయుధాలు వాడే అలవాటు ఉంది. ఇక గన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు చాలా పరీక్షలే చేస్తారు. వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంది, డ్రగ్స్ వాడుతున్నారా అన్న కోణంలో ఆ లైసెన్స్ చెకింగ్ ఉంటుంది. గన్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి క్రిమినల్ రికార్డు ఉందో లేదో కూడా చూస్తారు. ఒకవేళ గన్ కావాలనుకునేవాళ్లు.. జపాన్లో ఓ రోజంతా శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇక రాత పరీక్షకు కూడా హాజరుకావాలి. షూటింగ్ రేంజ్ ప్రకారం పాసవ్వాల్సి ఉంటుంది.
2020లో జపాన్లో తుపాకుల వల్ల 32 మరణాలు నమోదు అయ్యాయి. స్మాల్ ఆర్మ్స్ సర్వే ప్రకారం ఈ విషయం వెల్లడైంది. అదే ఏడాది ఇంగ్లండ్ అండ్ వేల్స్లోనూ అదే సంఖ్యలో మరణాలు సంభవించాయి. జీ7 దేశాల్లో సభ్యదేశమైన జపాన్లో అత్యల్ప స్థాయిలో తుపాకీ మృతులు నమోదు అవుతున్నాయి. షింజో అబేపై ఇవాళ హత్య ప్రయత్నం జరిగిన తర్వాత అసలు జపాన్లో ఇలాంటి ఘటన జరగడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. నిజానికి షింజో అబేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ దేశంలో ఆయన చాలా పాపులర్ ఫిగర్. గడిచిన మూడు దశాబ్ధాల్లో జపాన్లో గుర్తుపెట్టుకోదగిన రాజకీయవేత్తగా షింజో నిలిచారు. కానీ షింజోను ఎవరు చంపారు,ఎందుకు చంపాలనుకున్నారన్నదే తీరని ప్రశ్నగా మిగిలింది. అత్యంత సౌమ్యమైన జపాన్ దేశంలో ఇంత వాయిలెంట్ క్రైమ్ ఎలా జరిగిందని ప్రజలు కలవరపడుతున్నారు.
షింజో అబేను హత్య చేసిన షూటర్ను 41 ఏళ్ల టెట్సుయా యమగామిగా గుర్తించారు. కాల్పులు ఘటన జరిగిన వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని నివాసంలో సోదాలు చేస్తే కొన్ని చేదులు నిజాలు బయటకు వచ్చాయి. అతని ఇంట్లో పేలుడు పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్లో చేసిన యమగామి ఎందుకు మాజీ ప్రధాని షింజోను కాల్చి చంపాడో ఇంకా తేలాల్సి ఉంది. ప్రపంచ దేశాధినేతలు షింజోపై దాడిని ఖండిస్తున్నారు.