ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: పాకిస్థాన్ నూతన ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ సోమవారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు 174 మంది సభ్యుల మద్దతుతో షెహజాబ్ పాక్ 23వ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ఖాన్ ఓడిపోయిన నేపథ్యంలో పీఎం ఎన్నిక కోసం జాతీయ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే ఈ ఎన్నికను ఇమ్రాన్ఖాన్కి చెందిన పీటీఐ పార్టీ బహిష్కరించింది. ఆ పార్టీ తరపున మాజీ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ నామినేషన్ వేసినప్పటికీ, ఓటింగ్ ప్రారంభానికి ముందే ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు.
ఇమ్రాన్ వాదన ఓ డ్రామా
ప్రధానిగా ఎన్నికైన తర్వాత షెహబాజ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నన్ను ప్రధానిగా తప్పించేందుకు విదేశీ కుట్ర జరిగింది’ అన్న ఇమ్రాన్ ఆరోపణలను డ్రామాగా అభివర్ణించారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. భారత్లో ఆర్టికల్ 370 రద్దును లేవనెత్తుతూ కశ్మీర్ ప్రజలకు పాక్ దౌత్యపరమైన, నైతిక మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా తమ ఎంపీలందరూ రాజీనామాలు చేస్తున్నట్టు పీటీఐ నేత మహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఇందులో భాగంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో సహా పలువురు ఎంపీలు తమ రాజీనామాలు లేఖలు స్పీకర్కు పంపారు. ‘వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి పీఎంగా ఎన్నికయ్యారు. ఇది దేశానికి అవమానం. ఇటువంటి దొంగలతో తాము అసెంబ్లీలో కూర్చోలేము’ అని ఓటింగ్కు ముందు ఇమ్రాన్ వ్యాఖ్యలు చేశారు.
నవాజ్ షరీఫ్ సోదరుడే షెహబాజ్
షెహబాజ్ వయసు 70 ఏండ్లు. ఆయన మూడుసార్లు పాక్ ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్కు సోదరుడు. రాజకీయంగా కీలకమైన పంజా బ్ ప్రావిన్స్కు 3సార్లు సీఎంగా పనిచేశారు. ఇమ్రాన్ పాలనలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. షెహబాజ్ పీఎం కావడంతో గత కొద్దికాలంగా లండన్లో ఉంటున్న నవాజ్ షరీఫ్ తిరిగి దేశానికి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. దీనిపై పీఎంఎల్-ఎన్ నేత సీనియర్ నేత మియాన్ జావెద్ మాట్లాడుతూ ఈద్ పండుగ తర్వాత నవాజ్ దేశానికి వస్తారని, ఆయన రాకపై భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తామని తెలిపారు.