Coral reef | న్యూఢిల్లీ, మార్చి 4: సముద్రం లోపల అందంగా కనిపించే పగడపు దిబ్బలు క్రమంగా మాయమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత మూడు దశాబ్దాల్లో సగం పగడపు దీవులు మాయమైపోయాయని వారు అంచనా వేశారు. ఈ శతాబ్దం మధ్య కల్లా ఇది 90 శాతానికి చేరుకోవచ్చని తెలిపారు. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద గ్రేట్ బారియర్ రీఫ్ పై ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తున్నదని చెప్పారు. పగడపు దీవులు అనేవి పాలిప్స్ అనే జీవులని, వీటితో జాజాంతలీ అని పిలిచే ఆల్గేలు సహ జీవనం చేస్తాయని తెలిపారు.
పెరుగుతున్న భూతాపం, కాలుష్యం కారణంగా జూజాంతలీ పాలిప్స్ను విడిచి వెళుతున్నాయని వివరించారు. సముద్రంలో బలమైన అలలు, తుఫాన్లు వచ్చినప్పుడు తీర ప్రాంతాలు ప్రభావితం కాకుండా 97 శాతం తరంగ శక్తిని పగడపు దిబ్బలు అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా భౌగోళిక సర్వే ప్రకారం పగడపు దీవులు ఏటా 1.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని తగ్గిస్తాయని తెలిపారు.