న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా విస్తరిస్తున్నది. ఓ వైపు బ్రిటన్ వంటి దేశాల్లో ఉత్పరివర్తనం కారణంగా రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారుతుండగా.. భారత్లోనూ సంక్షోభం పెరుగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 150 వరకు పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుత వేరియంట్ తీవ్రత, ప్రభావంపై తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్త్రీయ అధ్యయనాలు జరుగుతున్నాయి.
గతంలో వచ్చిన ఉత్పరివర్తనాల కంటే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చరికలు జారీ చేసింది. దాని వేగాన్ని నియంత్రించకపోతే మరోసారి ప్రపంచాన్ని వణికిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ నుంచి రక్షణ కోసం ప్రజలంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో ఒమిక్రాన్ వేరియంట్పై ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త వేరియంట్ యూకే, దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్ను అధిగమించిందని పేర్కొంది. అనేక ఐరోపా దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపింది. జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ మాట్లాడుతూ ‘ఒమిక్రాన్ గతంలో మనం చూసిన వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం దాదాపు 77 కంటే ఎక్కువ దేశాల్లోనే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు మరిన్ని దేశాలకు విస్తరిస్తుండగా ఇన్ఫెక్షన్ రేటు ఆందోళన కలిగిస్తున్నది. వేరియంట్ సోకిన 24 గంటల తర్వాత డెల్టా వేరియంట్ (Delta Variant) , అసలైన సార్స్ కోవ్ 2 కంటే (SARS-Cov-2) కంటే ఒమిక్రాన్ 70రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం లేదని, కొవిడ్ కంటే పది రెట్లు తక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొంది.
కరోనా వైరస్ ఎప్పటికప్పుడు రూపం మార్చుకొని విరుచుకుపడుతున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న టీకాలు కొత్త వేరియంట్పై ప్రభావంతంగా పని చేస్తాయా? అనే విషయంపై నిపుణులు అధ్యయనం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు చెందిన గమలేయా నిర్వహించిన అధ్యయనం ఆధారంగా పరిశోధకులు స్పుత్నిక్ వీ టీకా (Sputnik V) , స్పుత్నిక్ లైట్ (Sputnik light) బూస్టర్ డోస్ కొత్త ఉత్పరివర్తనానికి వ్యతిరేకంగా మరింత ప్రభావవంతంగా ఉండవచ్చని పేర్కొన్నారు. స్పుత్నిక్ వీ టీకా ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న ఇతర టీకాల కంటే స్పుత్నిక్ వీ మరింత ప్రభావంతంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. టీకా వేసిన రెండు, మూడు నెలల తర్వాత స్పుత్నిక్ వీ లైట్ బూస్టర్ డోస్ ఇవ్వడంతో రోగనిరోధక శక్తి మరింత రుగుతుందంటున్నారు. ప్రస్తుతం టీకా తీసుకున్న వ్యక్తులు సైతం ఇన్ఫెక్షన్ తీవ్రతతో పాటు మరణాలను తగ్గిస్తుందని గుర్తించారు. మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు కొవిడ్ టీకా తీసుకోవడంతో పాటు అవసరమైన కొవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించడం సైతం ముఖ్యమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.