వాషింగ్టన్ : రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఎంఐటీ) విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిమెంట్కు ప్రత్యామ్నాయంగా సరికొత్త మెటీరియల్ను అభివృద్ధి చేశారు. మట్టి, నీరు, రీసైకిల్డ్ కార్డ్బోర్డ్లను ఉపయోగించి దీనిని తయారు చేశారు. సిమెంట్ అవసరం లేకుండానే ఈ పదార్థంతో భవనాలు, వంతెనలు వంటివాటిని నిర్మించవచ్చు. ఈ మిశ్రమాన్ని కార్డ్బోర్డ్-కన్ఫైన్డ్ రామ్మ్డ్ ఎర్త్ (సీసీఆర్ఈ) అంటారు. ప్రపంచంలో విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో దాదాపు 8 శాతం వరకు సిమెంట్ ద్వారా వెలువడుతున్నది.
వేలాది సంవత్సరాల క్రితం మట్టి, ఇసుక, చిన్న రాళ్లు, కొద్దిగా నీరు కలిపి, వాటిని అచ్చుల్లో వేసి, బలంగా దట్టించి, ముద్దగా చేసి, ఆ ముద్దతో గోడలు, భవనాలను నిర్మించేవారు. ఈ పద్ధతి సీసీఆర్ఈలో కనిపిస్తుంది. సిమెంట్ స్టెబిలైజర్లకు బదులుగా రీసైకిల్డ్ కార్డ్బోర్డ్ ట్యూబ్లను వాడతారు. వస్తువుల రవాణాకు, పేపర్ రోల్స్ను భద్రపరచడానికి వాడిన ఈ కార్డ్బోర్డ్ ట్యూబులు ఈ సరికొత్త మెటీరియల్కు ఆకారాన్ని ఇచ్చే అచ్చులు గానూ, బలాన్ని పెంచే స్టీల్ ఊచలుగానూ ఉపయోగపడతాయి. మట్టి, నీరు మిశ్రమాన్ని కార్డ్బోర్డ్ అచ్చుల్లో బిగుతుగా నింపి, ఆరబెడతారు. ఇవి బరువును మోయగల నిలువు స్తంభాలుగా ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియలో సిమెంట్ అవసరం ఉండదు.
క్యూరింగ్, బట్టీలు, అత్యధిక ఉష్ణోగ్రత వంటివేవీ అక్కర్లేదు. సిమెంట్తో దట్టించిన మట్టి కన్నా కార్డ్బోర్డ్తో దట్టించిన మట్టి ఎక్కువ బలంగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. నిర్మాణానంతర వృథా కనిష్టంగా ఉంటుంది. దీనిలోని మెటీరియల్స్ను వేరు చేయవచ్చు. అవి పర్యావరణంలోకి తిరిగి కలిసిపోయే అవకాశం ఉం టుంది. పగలు వేడిని గ్రహించి, రాత్రి దానిని నెమ్మదిగా విడుదల చేసే సామర్థ్యం సీసీఆర్ఈకి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అంతర్గత ఉష్ణోగ్రతలను సమతా స్థితిలో ఉంచవచ్చు. ఎయిర్ కండీషనింగ్ అవసరాన్ని తగ్గించవచ్చు. వాతావరణ సమస్యలు, ఇంధన కొరత గల ప్రాంతాల్లో సీసీఆర్ఈ వల్ల ఉద్గారాలు, విద్యుత్తు బిల్లులు కూడా తగ్గుతాయి.