కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలను బంద్ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల కోసం టీచర్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ఆదేశించింది.
ఇప్పటికే దేశానికి వస్తున్న దిగుమతులకు డబ్బులు చెల్లించడానికి లంక ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. అదే సమయంలో ఇంధన నిల్వలు కూడా వేగంగా తరిగిపోతున్నాయి. దాంతో పెట్రోలు, డీజిల్ కోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది.
‘‘ప్రస్తుతం దేశంలో ఉన్న పరిమిత ఇంధన సరఫరాను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేటు వాహనాలు నడపడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా అతి తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వచ్చేందుకు ఈ సర్కులర్ అనుమతినిస్తోంది’’ అంటూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హోం అఫైర్స్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఆదేశాలు విడుదల చేశాయి.
అయితే వైద్యారోగ్య శాఖలో పని చేసే వాళ్లు మాత్రం ఉద్యోగాలకు రావలసి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. కొన్ని నెలలుగా శ్రీలంకలో ప్రతిరోజూ సుమారు 13 గంటలపాటు కరెంటు కోతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ ఖజానాను కాపాడుకునేందుకే ఇక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రైవేటు కంపెనీల టర్నోవర్ను బట్టి 2.5 శాతం సోషల్ కంట్రిబ్యూషన్ ట్యాక్స్ విధించడానికి కూడా లంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది.