Saudi Arabia | విదేశీ ప్రయాణికులపై కరోనా ఆంక్షలను త్వరలోనే తొలగించనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ జాబితాలో భారత్ సహా మరో ఐదు దేశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌదీ వెళ్లే విదేశీయులు మరో దేశంలో కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే. అప్పుడే సౌదీలోకి వారిని అనుమతిస్తున్నారు.
అయితే వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి భారత్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నేరుగా తమ దేశంలోకి అనుమతిస్తామని సౌదీ వెల్లడించింది. అయితే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా కూడా ఐదు రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు కూడా ఈ క్వారంటైన్లో ఉండాల్సిందేనని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది కరోనా కారణంగా విదేశీ ప్రయాణికులపై సౌదీ అరేబియా ట్రావల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.