ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమిక్రాన్’ కరోనా వేరియంట్ కేసు సౌదీ అరేబియాలో వెలుగు చూసింది. ఈ దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి సౌదీ పౌరుడేనని, అయితే తాజాగా ఉత్తర ఆఫ్రికా వెళ్లి తిరిగొచ్చాడని అధికారులు చెప్పారు.
ఒమిక్రాన్ సోకడంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచామని, అలాగే అతనితో కాంటాక్ట్లోకి వచ్చిన వారిని కూడా ఐసోలేట్ చేశామని వివరించారు. ఈ క్రమంలో ప్రజలంతా వ్యాక్సిన్ పూర్తి డోసులు తీసుకోవాలని సౌదీ ప్రభుత్వం సూచించింది.
కాగా, విపరీతంగా మ్యుటేట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకారి అని, అంతర్జాతీయంగా దీనివల్ల చాలా రిస్క్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇటీవలే హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ భయంతో ఇజ్రాయెల్, మొరాకో, జపాన్ తదితర దేశాలు తాము బోర్డర్లు మూసేస్తున్నట్లు ప్రకటించాయి.