జెడ్డా: గత కొన్నివారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రభుత్వం తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్తోపాటు మరో 15 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని పౌరులపై ఆంక్షలు విధించింది. సౌదీ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల జాబితాలో భారత్, లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, అఫ్ఘానిస్థాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనెజులా ఉన్నాయి.
కాగా, తమ దేశంలో ఒక్క మంకీపాక్స్ కేసులు నమోదవలేదని సౌదీ డిప్యూటీ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్లా అసిరి చెప్పారు. ఒకవేళ అలాంటి కేసులు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు మంకీపాక్స్ మనుషుల నుంచి మరొకరికి వ్యాప్తిచెందిన కేసులు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 11 దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. వైరస్ వ్యాప్తి గురించిన అధ్యయనం జరుగుతున్నదని తెలిపింది.