Sai Varshith | అమెరికాలోని వైట్ హౌస్పై ట్రక్కుతో దాడికి యత్నించిన తెలుగు కుర్రాడు కందుల సాయివర్షిత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు విచారణ దాదాపు పూర్తికావచ్చింది. ఈ సందర్భంగా సాయివర్షిత్ తన నేరాన్ని కోర్టులో అంగీకరించాడు. బైడెన్ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కార్ను తీసుకొచ్చేందుకే తాను ఈ దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఇందుకోసం అవసరమైతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా అడ్డొచ్చిన వారిని చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడట. సాయి వర్షిత్ ఈ విషయాలు అన్నింటినీ కోర్టులో తెలిపినట్లుగా యూఎస్ అటార్నీ వెల్లడించింది. ఈ కేసులో సాయి వర్షిత్ ఉద్దేశపూరితంగానే దాడికి పాల్పడినట్లు విచారణలో రుజువైందని తెలిపింది. కాగా, కేసు విచారణ పూర్తి చేసిన డిస్ట్రిక్ట్ కోర్టు.. ఆగస్టు 23వ తేదీన శిక్ష ఖరారు చేయనుంది.
మే 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో వైట్హౌస్ సమీపంలో ఓ ట్రక్కు కలకలం సృష్టించింది. భవనం బయటి సైడ్వాక్ నుంచి అడ్డదారిలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు శ్వేతసౌధం ఉత్తరభాగంవైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ను ఢీకొట్టింది. ఆ తర్వాత రివర్స్ డైరెక్షన్లో వెనక్కి వచ్చి మరోసారి ఢీకొట్టింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కును చుట్టుముట్టి వర్షిత్ను అదుపులోకి తీసుకున్నారు.
వైట్హౌస్పై దాడికి సంబంధించి ఆరు నెలల నుంచే వర్షిత్ పక్కా ప్లాన్ సిద్ధం చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. ‘యూ-హౌల్’ రెంటల్ కంపెనీ నుంచి ఓ ట్రక్కును అద్దెకు తీసుకొన్నాడు. అనంతరం.. వైట్హౌస్ బయట ఉన్న సైడ్వాక్ వద్దకు ట్రక్కును పోనిచ్చాడు. అనంతరం ట్రాఫిక్ బారియర్స్ను పలుమార్లు ఢీకొట్టాడు. దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన గ్రీన్బుక్లో నిందితుడు రాసుకొన్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడి నుంచి నాజీ జెండాను స్వాధీనం చేసుకొన్నట్టు పేర్కొన్నారు. ఈ జెండాను ఆన్లైన్లో అతడు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు.
మిస్సోరిలోని ఛెస్ట్ఫీల్డ్కు చెందిన సాయి వర్షిత్ది భారత సంతతికి చెందిన కుటుంబం. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సాయివర్షిత్పై ఎలాంటి క్రిమినల్ రికార్డు కూడా లేదని గతంలో పోలీసులు వెల్లడించారు.