Luna-25 | మాస్కో, ఆగస్టు 19: రష్యా, భారత్ మధ్య మొదలైన జాబిల్లి రేస్ రసవత్తరంగా మారింది. నువ్వానేనా అన్నట్టుగా రెండు దేశాల వ్యోమనౌకలు చంద్రుడి వైపు దూసుకెళ్తున్న వేళ రష్యా ప్రయోగించిన లూనా-25 స్పేస్క్రాఫ్ట్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం చేపట్టిన వేగం తగ్గింపు విన్యాసం సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తినట్టు రోస్కాస్మోస్ వెల్లడించింది.
‘ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దీంతో విన్యాసం చేసేందుకు వీలు కాలేదు’ అని రోస్కాస్మోస్ తెలిపింది. చంద్రయాన్-3 కంటే ముందే ఈ నెల 21న చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్న వేళ ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ రెండు వ్యోమనౌకల్లో ఏదీ ముందుగా జాబిల్లిని చేరుతుందనే అంశం మరోసారి ఆసక్తికరంగా మారింది.