ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తున్న తీరును రష్యా ప్రతిపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ తూర్పురా పట్టారు. ఉక్రెయిన్ వల్ల కానీ, అమెరికా వల్ల గానీ రష్యాకు ప్రమాదం లేదని, అధ్యక్షుడు పుతిన్ వల్లే రష్యాకు అత్యధిక ప్రమాదమని ప్రతిపక్ష నేత తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 16 ట్వీట్లు చేస్తూ.. విరుచుకుపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలన వల్లే దేశ ప్రజలు పేదలవుతున్నారని, అమెరికా వల్ల మాత్రం కాదని విమర్శించారు. పుతిన్, ఆయన మద్దతుదారులను అధికారం నుంచి తొలగించాలని, రష్యాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ పేర్కొన్నారు.
రష్యా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా చేస్తున్నారంటూ ఎలెక్సీ నెవెలనీ విమర్శించారు. రష్యాలో ఉన్న సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా చేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని, ధరలు విపరీతంగా పెరిగాయని, వీటన్నింటి నుంచి దృష్టి మరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వానికి సంబంధించిన ఛానెళ్లలో రష్యాకు సంబంధించిన సమాచారమే లేదని, ఎంత సేపూ ఉక్రెయిన్, అమెరికా, యూరప్ సమాచారమే ఇస్తున్నారని విపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ మండిపడ్డారు. రష్యాలో అవినీతి విపరీతంగా పెరిగిందని, దృష్టి మరల్చడానికే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్కు ఎంత సేపూ రక్తమే కావాలని, ఇలాంటి చర్యలతో ఎన్నో ప్రాణాలు నష్టపోయే ఛాన్స్ ఉందన్నారు. ఒకవేళ యుద్ధం చేస్తే అటు రష్యా పౌరులు,ఇటు ఉక్రెయిన్ పౌరులు చనిపోయే ప్రమాదం ఉందని, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పుతిన్ రష్యాను ఏ మాత్రం అభివృద్ధి చేయరని, రష్యా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని విపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ హెచ్చరించారు.