కీవ్: ఉక్రెయిన్లో యుద్ధంతో సంబంధం ఉన్నవారితో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతో యుద్ధభూమిలో ఇప్పటికైనా బాంబుల మోతకు ఫుల్స్టాప్ పడుతుందని భావించారు. అయితే పుతిన్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్లోని పట్టణాలపై రష్యా సైనికులు విరుచుకుపడ్డారు. ఖార్కివ్లోని పలు పట్టణాలపై రాకెట్లు, క్షిపణుల వర్షం కురిపించారు. ఖార్కివ్ రీజియన్లోని కుపియాన్స్క్ జిల్లాలో పదికిపైగా రాకెట్లు వచ్చిపడ్డాయని, 25 టౌన్లపై క్షిపణులతో దాడులు చేశారని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అదేవిధంగా జపోరిజియాలోని 20 టౌన్లపై బాంబులతో దాడిచేసినట్లు వెల్లడించింది.
కాగా, ఉక్రెయిన్తో యుద్ధంలో సంబంధం ఉన్న వారందరితో చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. కానీ ఉక్రెయిన్, దాని పాశ్చాత్య మిత్రపక్షాలు మాత్రం చర్చల కోసం ముందుకు రావడం లేదని ఆరోపించారు. రష్యా మీడియా ఆదివారం విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.‘యుద్ధంతో సంబంధం ఉన్న వారందరితో చర్చలు జరపడానికి మేము సిద్ధం. ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఇస్తే చర్చలు జరుపుతాము. కానీ చర్చలనేది వారి చేతుల్లోనే ఉంది. చర్చలను మేము అడ్డుకోవడం లేదు. ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలే అడ్డుకుంటున్నాయి’ అని అన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. తమ దేశభద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉక్రెయిన్ ప్రవర్తిస్తున్నదంటూ ఆ దేశంపై దాడికి దిగింది. తమ లక్ష్యాలు నెరవేరేంత వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.