తూర్పు ఉక్రెయిన్లోని క్రామాటోర్స్క్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్పై రష్యా దళాలు రాకెట్లతో దాడులు చేశాయి. ఈ దాడిలో 30 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. 100 కు పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. రష్యా దాడుల సందర్భంగా ఉక్రెయిన్ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో ఈ దాడులు చేశారని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రెండు రాకెట్లు ఒకేసారి రైల్వే స్టేషన్పై దాడులు చేశాయని, గాయపడ్డ వారిని బస్సుల ద్వారా, ఇతరత్రా మార్గాల ద్వారా ఆస్పత్రులకు తరలిస్తున్నామని అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఈ దాడి గురించి రష్యా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇరు పక్షాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ.. తాము సాధారణ పౌరులపై దాడులు చేయమని, కేవలం ఆర్మీ, ప్రభుత్వ కార్యాలయాలపైనే దాడులు చేస్తామని రష్యా ప్రకటించింది. అయినా… ఈ హామీని తుంగలో తొక్కి పౌరులపై కూడా దాడులకు తెగబడుతోంది.