మాస్కో : మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తే అది అణ్వాయుధాలతోనే సాగుతుందని ఈ యుద్ధంతో పెను విధ్వంసం తప్పదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అణ్వాయుధాలను సమీకరించేందుకు రష్యా అనుమతించదని అన్నారు. ఆంక్షలకు రష్యా సిద్ధంగా ఉందని అయితే తమ అథ్లెట్లు, జర్నలిస్టులు, సాంస్క్రతిక ప్రతినిధులను పాశ్చాత్య దేశాలు టార్గెట్ చేస్తాయని ఊహించలేదని లావ్రోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు బుధవారం ఏడో రోజు కొనసాగాయి.
కీవ్ సహా పలు ప్రధాన నగరాల్లో ఇరు దళాల మధ్య భీకర పోరు సాగుతోంది. కీవ్లోకి రష్యన్ సేనలు చొచ్చుకొస్తుండగా ఉక్రెయిన్ దళాలు ప్రతిఘటిస్తున్నాయి. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసుల స్ధావరాలపై దాడులకు సన్నద్ధమయ్యామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రధాన నగరం ఖర్కీవ్పై విరుచుకుపడ్డాయి. రాకెట్ దాడులు, కాల్పుల శబ్ధాలతో ఖర్కీవ్ నగరం మార్కోగుతోంది.
ఖర్కీవ్లో రష్యన్ కాల్పులను యుద్ధ నేరంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్స్కీ అభివర్ణించారు. ఇక ఉక్రెయిన్కు అమెరికా అండగా నిలుస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు. అయితే తాము నేరుగా రష్యా సేనలతో తలపడబోమని చెప్పారు. తమ మిత్రపక్షాలతో కలిసి నాటో పరిధిలోని ప్రాంతాలను అమెరికా కాపాడుకుంటుందని స్పష్టం చేశారు.