మాస్కో : ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్పై ఇప్పటికే రష్యన్లు మండిపడుతుండగా ఇప్పుడు ఆ దేశ బిలియనీర్లు యుద్ధంతో ముంచుకొచ్చే అనర్ధాలను ఏకరువు పెడుతున్నారు. పుతిన్ ఏకపక్ష నిర్ణయాన్ని ఎండగడుతూ తక్షణమే యుద్ధాన్ని ఆపాలని అక్కడి సంపన్నులు హితవు పలికారు. ఉక్రెయిన్పై దండయాత్రను నిలిపివేయాలని రష్యన్ బిలియనీర్లు మైఖేల్ ఫ్రైడ్మన్, ఒలెగ్ దెరిపస్క డిమాండ్ చేశారు. యుద్ధంతో పెను విపత్తు ముంచకొస్తుందని మరో బిలియనీర్ ఆందోళన వ్యక్తం చేశారు.
స్విఫ్ట్ అంతర్జాతీయ పేమెంట్ సిస్టం నుంచి రష్యన్ బ్యాంకులను పాశ్చాత్య దేశాలు బ్లాక్ చేయడంతో డాలర్తో రష్యా కరెన్సీ ఏకంగా 30 శాతం పడిపోయింది. రష్యా సెంట్రల్ బ్యాంక్ను అమెరికా లక్ష్యంగా చేసుకుని మరిన్ని ఆంక్షలు విధిస్తే జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జపాన్, ఈయూ కూడా అమెరికా బాటలో నడిచే అవకాశం ఉండటంతో రష్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శతాబ్ధాలుగా సోదరులుగా జీవిస్తున్న రష్యా, ఉక్రెయిన్ పౌరుల్లో యుద్ధం విభజన చిచ్చు రేపుతుందని పశ్చిమ ఉక్రెయిన్లో జన్మించిన రష్యన్ బిలియనీర్ ఫ్రైడ్మన్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాను పశ్చిమ ఉక్రెయిన్లో 17 ఏండ్ల వయసు వరకూ ఉన్నానని, తమ తల్లితండ్రులు ఉక్రేయిన్ పౌరులని చెప్పుకొచ్చారు. వ్యాపారంలో ఎదుగుతూ తన జీవితంలో అత్యధిక కాలం రష్యా పౌరుడిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ పౌరులకు ప్రస్తుత వివాదం ఇద్దరకీ విషాదకరమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలని రష్యన్ బిలియనీర్లు ఆకాంక్షించారు. యుద్ధానికి తెరదించాలని ఇరు దేశాల్లో శాంతి నెలకొనాలని వారు పిలుపు ఇచ్చారు.