మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ వరుస ప్రకటనలతో ఆ దేశ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్రెయిన్పై మరింతగా దాడి కోసం ప్రయత్నాలను పుతిన్ ముమ్మరం చేస్తున్నారు. దేశంలో మార్షల్ లా విధించవచ్చని మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో రష్యా నుంచి వెళ్లి పోయేందుకు ఆ దేశ ప్రజలు భారీగా రైల్, ఎయిర్ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారుల ఆదేశాలతో 18-65 ఏళ్ల పురుషులకు టిక్కెట్ల అమ్మకాలను రష్యన్ రైల్వే, ఎయిర్లైన్స్ సంస్థలు నిలిపివేశాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతించిన యువకులను మాత్రమే దేశం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
కాగా, రష్యా సమీప దేశాలైన అర్మేనియా, జార్జియా, అజర్బైజాన్, కజాఖస్తాన్ దేశాలకు వెళ్లే అన్ని విమానాల టిక్కెట్లు అమ్ముడైనట్లు రష్యాకు చెందిన ప్రముఖ ఏవియాసేల్స్ వెబ్సైట్ తెలిపింది. అలాగే రష్యా నుంచి ఇస్తాంబుల్కు వెళ్లే అన్ని విమానాల టిక్కెట్లు శనివారం వరకు బుక్ అయినట్లు టర్కీ ఎయిర్లైన్స్ పేర్కొంది.
మరోవైపు ఉక్రెయిన్పై దాడి కోసం జైల్లో ఖైదీలుగా మగ్గుతున్న కిరాతక దొంగలు, కరుడుగట్టిన హంతకులను సైన్యంలోకి రిక్రూట్ చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. అలాగే భారీగా సైనిక నియామకాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
దీంతో ఖైదీల రిక్రూట్మెంట్ను వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ చేపడుతున్నట్లు గార్డియన్ తెలిపింది. నర హంతకులతోపాటు నరమాంస భక్షకులు కూడా ఇందులో ఉంటారని పేర్కొంది. ఉక్రెయిన్పై యుద్ధం కోసం రిక్రూట్ చేసే ఖైదీలకు ఆరు నెలల తర్వాత అధ్యక్షుడి క్షమాభిక్షతోపాటు నెలకు లక్ష రూబెల్స్ వేతనంగా ఇస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది.
కాగా, పుతిన్ ఆదేశాలతో మూడు లక్షల మందిని సైన్యంలోకి తీసుకుంటామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు బుధవారం తెలిపారు.