కీవ్: తూర్పు ఉక్రెయిన్లో ఉన్న అన్ని నగరాలపై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. డోనెస్కీ ఫ్రంట్లైన్లో ఉన్న అన్ని పట్టణాలపై బాంబుల వర్షం కురుస్తోంది. డోనెస్కీ ప్రాంతంలో 2014 నుంచి ఉక్రెయిన్ దళాలు, వేర్పాటువాదుల మధ్య భీకర పోరు సాగుతోంది. మారియంక, నొవోమికైలివికా పట్టణాలపై దాడులు జరుగుతున్నట్లు పవ్లో కిర్లెంకో తెలిపారు. అక్కడ భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. డోనెస్కీ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని రష్యా దళాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి భీతావాహంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా దాడి వల్ల ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 40 లక్షల మంది వలస వెళ్లారు. దీంట్లో 23 లక్షల మంది పోలాండ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య ఇస్తాంబుల్లో జరిగిన చర్చలు ప్రయోజనకరంగా ముగిసినట్లు జెలెన్స్కీ ఆఫీసు తెలిపింది. పోర్టు నగరం మికోలైవ్లోని ప్రభుత్వ బిల్డింగ్పై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో 30 మంది గాయపడ్డారు.