మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ, ఐరోపా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయితే రష్యా అధ్యక్షుడు వీటిని లెక్కచేయడం లేదు. పైగా ఆంక్షలు విధించిన దేశాలపై ప్రతి చర్యలకు దిగుతున్నారు. ఐరోపా సమైఖ్య (ఈయూ) ఆంక్షల నేపథ్యంలో ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్ష ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా అంతరిక్ష సంస్థ రోసోకాస్మోస్ డైరెక్టర్ జనరల్ డిమిత్రి రోగోజిన్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘మా సంస్థలకు వ్యతిరేకంగా ఈయూ విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా, కౌరౌ కాస్మోడ్రోమ్ నుంచి అంతరిక్ష ప్రయోగాల నిర్వహణ, యూరోపియన్ భాగస్వాములతో సహకారాన్ని రోసోకాస్మోస్ నిలిపివేస్తోంది. ప్రయోగ సిబ్బందితోసహా సాంకేతిక సిబ్బందిని ఫ్రెంచ్ గయానా నుంచి ఉపసంహరించుకుంటోంది’ అని పేర్కొన్నారు.
కాగా, దీనికి ముందు అమెరికా విధించిన ఆంక్షలపైనా రోసోకాస్మోస్ డైరెక్టర్ జనరల్ డిమిత్రి రోగోజిన్ మండిపడ్డారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నిర్వాహణపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. తమ సహకారం లేకపోతే ఐఎస్ఎస్ నియంత్రణ కోల్పోయి అమెరియా, ఐరోపా, భారత్ లేదా చైనాపై శకలాలు పడితే బాధ్యత ఎవరు వహిస్తారు, ఆ నష్టం మీరే భరించాలి అని అమెరికాను నిలదీశారు. ఐఎస్ఎస్ తమ దేశంపై తిరుగదని, అందువల్ల దాని వల్ల తమకు ఎలాంటి ముప్పు లేదన్నారు.