రష్యా- ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. బుధవారం రాత్రి ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా అంగీకరించింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య సోమవారం బెలారస్ సరిహద్దుల్లో జరిగిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాల్లో రష్యా బాంబు దాడులు పెరగడం, సామాన్యులను కూడా రష్యా దళాలు టార్గెట్ చేసిన నేపథ్యంలో రెండో రౌండ్ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.
బెలారస్ సరిహద్దుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య సోమవారం చర్చలు జరిగాయి. దాదాపు 5 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ నుంచి రక్షణ మంత్రి, అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొంటే.. రష్యా వైపు నుంచి అధ్యక్షుడు పుతిన్ సాంస్కృతిక సలహాదారు నేతృత్వంలో ఓ అధికారుల బృందం హాజరైంది. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఇంత సీరియస్ సమావేశాలకు వీరు హాజరు కావడం ఏంటని సూటిగానే ప్రశ్నించింది. ప్రాథమిక డిమాండ్లలోనే ఎవరి పట్టు నుంచి వారు పక్కకు రాకపోవడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి.