ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడానికి రెడీ అయిపోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫిబ్రవరి 16న ఉక్రెయిన్పై దాడులకు దిగాలని రష్యా అధ్యక్షుడు వ్లాద్మీర్ పుతిన్ ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారని ఆ మీడియా పేర్కొంది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించనున్నారు.ఈ విషయాన్ని వైట్హౌజ్ అధికారులు ధృవీకరించారు కూడా.
యుద్ధాన్ని నివారించే విషయమై ఫోన్లో మాట్లాడనున్నారు. జర్మన్ పత్రిక డెర్ స్పిగల్ ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ నాటో అధికారులతో మాట్లాడినట్లు కూడా ఈ పత్రిక పేర్కొంది. ఒకవేళ రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగితే.. తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహం, తదనంతర పరిణామాలపై జోబైడెన్ నాటో అధికారులతో చర్చించారు.
మరోవైపు రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్పై దాడులకు దిగొచ్చని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులంతా 48 గంటల్లోగా ఆ దేశాన్ని విడిచి రావాలని అమెరికా అధికారులు సూచించారు. ఏరియల్ బాంబింగ్తో దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అమెరికా అంచనా వేస్తోంది. ఒకవేళ వైమానిక దాడులు ప్రారంభమైతే, అక్కడి రావడం ఇబ్బందిగా మారుతుందని, అమెరికా పౌరుల జీవితాలు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని అమెరికా అభిప్రాయపడింది.