కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇవాళ రాకెట్ దాడి జరిగింది. కనీసం మూడు రాకెట్లు వివిధ ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది. ఈద్ అల్ అదా(బక్రీద్) పర్వదినం నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ జాతిని ఉద్దేశించి ప్రసంగం చేయడానికి ముందే ఈ ఘటన చోటుచేసుకున్నది. రాకెట్ దాడుల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. ఇటీవల నాటో, అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి వైదొలిగిన తర్వాత.. అక్కడ తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. అయితే తొలిసారి ఉగ్రవాదులు కాబూల్ను టార్గెట్ చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అత్యంత పటిష్ట భద్రతతో ఉన్న గ్రీన్ జోన్ ప్రాంతం చుట్టూ రాకెట్ దాడులు జరిగాయి. ఆ ప్రాంతంలో అధ్యక్షుడి భవనం, పలు దేశాల ఎంబసీలు ఉన్నాయి. అమెరికా మిషన్ సెంటర్ కూడా ఆ ప్రాంతంలోనే ఉంది. మూడు రాకెట్లు మూడు ప్రాంతాల్లో పడినట్లు హోంశాఖ ప్రతినిధి స్టానికాజి తెలిపారు. ఓ ట్రక్కు నుంచి ఆ రాకెట్లను పేల్చారు. అయితే దాడి జరిగిన కొన్ని నిమిషాల తర్వాత అధ్యక్షుడు ఘనీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.