Akshata Murthy | బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్ఫోసిస్ నుంచి భారీ డివిడెండ్ పొందారు. అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఇన్ఫోసిస్లో భారీగా షేర్లు ఉన్నాయి. కాగా, 2022 సంవత్సరానికి గానూ అక్షత తన వాటాలపై డివిడెండ్ రూపంలో రూ.126.61కోట్ల ఆదాయం పొందారు.
అక్షత మూర్తికి ఇన్ఫోసిస్లో 0.93 శాతం మేర వాటా ఉంది. ఆమె పేరిట 3.89 కోట్ల షేర్లు ఉండగా… వాటి విలువ రూ.5,956 కోట్లు. ఈ ఏడాది మే 31న 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్ ఒక్కో షేరుపై రూ.16 చొప్పున డివిడెండ్ చెల్లించింది. మే నుంచి అక్టోబరు వరకు రూ.16.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీంతో ఒక్కో షేరుపై మొత్తం డివిడెండ్ రూ.32.5 కాగా, అక్షత మూర్తికి తన వాటాలపై డివిడెండ్ రూపంలో రూ.126.61కోట్ల ఆదాయం వచ్చింది.
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికైన విషయం తెలిసిందే. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా నిలిచారు.