Rich than King | బ్రిటన్ రారాజు చార్లెస్ III ఆస్తి ఆ దేశ ప్రధాని కన్నా తక్కువగా ఉన్నాయి. క్వీన్ ఎలిజెబెత్ మరణంతో కుటుంబ వారసత్వంగా కింగ్ చార్లెస్కు ఆస్తి సమకూరింది. అయినప్పటికీ రాజు ఆస్తి రిషి సునక్ కన్నా తక్కువగా ఉండటం విశేషం. కింగ్ చార్లెస్ III కి దాదాపు 300-350 మిలియన్ పౌండ్ల ఆస్తులు కలిగి ఉండగా.. రిషి సునక్, అక్షత మూర్తి దంపతుల ఆస్తుల విలువ రాజు కన్నా రెట్టింపుగా ఉన్నాయి. రిషి దంపతులు దాదాపు 730 మిలియన్ పౌండ్లు (826 మిలియన్ అమెరికన్ డాలర్లు) ఆస్తులు కలిగి ఉన్నారు. రిషి సునక్ పేరిట ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 15 మిలియన్ పౌండ్ల విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నది.
రాజు వారసత్వంగా పొందిన నికర ఆస్తుల విలువ దాదాపు 440 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నదని వెల్త్-X అనే సంస్థ అంచనా వేసింది. రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్, ఇతర ఆస్తుల ద్వారా ఈ ఆదాయం పొందుతున్నారని వెల్లడించింది. 730 మిలియన్ పౌండ్ల ఆస్తులతో బ్రిటన్ ప్రధాని రిషి దంపతులు యూకేలోని ధనవంతుల జాబితాలో 222 వ స్థానంలో నిలిచారు. అలాగే, 10 డౌనింగ్ స్ట్రీట్లోని ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని ఆక్రమించిన అత్యంత ధనవంతుడు కూడా రిషి సునక్ కావడం విశేషం.
భారత మూలాలున్న రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. లిజ్ట్రస్ రాజీనామాతో ప్రధాని పదవికి రిషి ఒక్కరే నామినేషన్ వేయడంతో రిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిషి పంజాబ్ మూలాలున్న వ్యక్తి కాగా, ఈయన భార్య ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి. నారాయణమూర్తి కంపెనీలో అక్షత మూర్తికి 0.91 శాతం వాటా కలిగి ఉన్నది. ఈ వాటా విలువ మొత్తం 700 మిలియన్ పౌండ్లు.