Violence @ Paris | పారిస్లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. అల్లర్లు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ అల్లర్లలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. శుక్రవారం పారిస్లో కుర్దీష్ కమ్యూనిటీపై జాతి వివక్షతో జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అప్పటి నుంచి పారిస్ అంతటా అల్లర్లు కొనసాగుతున్నాయి.
ఆందోళనలు జరుగుతున్న రిపబ్లిక్ స్క్వేర్ సమీపంలో మంటలు చెలరేగాయి. నిరసనలు అకస్మాత్తుగా ఎలా హింసాత్మకంగా మారాయో అంతుపట్టడం లేదని పారిస్ పోలీస్ చీప్ లారెంట్ నునెజ్ చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న 11 మందిని అరెస్టు చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనాకారులను చెదరగొట్టారు. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 30 మంది పోలీసులు, ఒక నిరసనకారుడు గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టడానికి ముందు 2 గంటలపాటు ఆందోళనలు కొనసాగాయి.
నిరసనల్లో పారిస్ 10 వ జిల్లా మేయర్ సహా పలువురు రాజకీయ నాయకులతో కలిసి వందలాది మంది కుర్దిష్ నిరసనకారులు జెండాలు చేతబూని చనిపోయిన వారికి నివాళులర్పించారు. గత పదేండ్లలో ఆరుగురు కుర్దిష్ కార్యకర్తలు పారిస్ నడిబొడ్డున పట్టపగలు హత్యకు గురయ్యారని, మాకు పారిస్లో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని ఓ నిరసనకారుడు చెప్పాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఆందోళన చేపట్టామని ఆయన తెలిపాడు.