Bangladesh : బంగ్లాదేశ్లో ఒక హిందూ కుటుంబం అనుమానాస్పదంగా మరణించింది. ఈ ఘటనతో స్తానిక హిందువులు మరోసారి ఉలిక్కిపడ్డారు. మృతుల్లో ఒక రిటైర్డ్ టీచర్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్, రంగ్పూర్ మెట్రోపాలిటన్ కొత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్తానిక మీడియా, బంధువులు తెలిపిన వివరాలివి.
గణపతి చక్రవర్తి (65) అనే వ్యక్తి రంగ్పూర్ జిల్లా స్కూల్ టీచర్గా పని చేసి, గత ఏడాది డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. ఆయన ఇటీవలే సొంత ఇల్లు నిర్మించుకుని, భార్య ప్రీతిలతా చక్రవర్తి (50), కూతురు అగామి చక్రవర్తి ప్రార్థి (23), కొడుకు ప్రియం చక్రవర్తి (12)తో కలిసి ఉంటున్నాడు. పిల్లల్లో అగామి ఇటీవలే ఇంగ్లీష్లో మాస్టర్స్ పూర్తి చేయగా, కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. వీరి కుటుంబానికి స్తానికులతో, ఎవరితో ఎలాంటి విబేధాలు లేవు. అనుమానించదగ్గ శతృవులు కూడా లేరు. గణపతి చక్రవర్తి కుటుంబంతో బంధువులు చివరగా గత గురువారం ఫోన్లో మాట్లాడారు.
ఆ తర్వాత నుంచి ఆ కుటుంబంలోని నలుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో చాలాసార్లు ఫోన్ చేసినా.. ఎవరూ స్పందించలేదు. చివరకు శనివారం సాయంత్రం ప్రీతిలత సోదరి వారి ఇంటికి వచ్చింది. అప్పటికి ఇల్లు పూర్తిగా లాక్ చేసి ఉంది. గేట్లు వేసి ఉన్నాయి. ఇంటి లోపల నుంచి తలుపులు గొల్లెం పెట్టుకుని ఉన్నారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. ఇంట్లో నలుగురు మరణించి ఉన్నారు. పై కప్పు మీద గణపతి, మెట్లమీద ప్రీతిలత, అగామి మరణించి ఉండగా, కొడుకు ప్రియం మృతదేహం బెడ్పై పడి ఉంది.
దీంతో గణపతి బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. వారి మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నారు. తమ వారిది హత్యే అని, నిందితులపై చర్యలు తీసుకోవాలని గణపతి బంధువులు కోరుతున్నారు. అయితే, ఈ ఘటనతో స్తానిక హిందువుల్లో మరోసారి కలకలం రేగింది. గతేడాది బంగ్లాదేశ్లోని అనేక ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.