Nikki Haley-Trump | భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ, వచ్చే ఏడాది (2024) జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడుతున్న తొలి అభ్యర్థి కానున్నారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేయడం ద్వారా నిక్కీ హేలీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం తొలుత పార్టీల మధ్య అంతర్గతంగా నామినేషన్లు దాఖలు చేస్తారు. ఆయా అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరాటం తర్వాత తుది అభ్యర్థి ఖరారవుతారు. దీని ప్రకారం డొనాల్డ్ ట్రంప్తోపాటు తానూ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని నిక్కీహేలీ ప్రకటించారు.
51 ఏండ్ల నిక్కీ హేలీ తొలి నుంచి రిపబ్లికన్ పార్టీలోనే ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో ఆమె ముందు వరుసలోనే నిలిచారు. ట్రంప్, నిక్కీ హేలీతోపాటు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ నుంచి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెస్సెంటీస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తదితరులు పోటీ పడనున్నారు.
గతంలో సౌత్ కాలిఫోర్నియా గవర్నర్గా పని చేసిన నిక్కీ హేలీ.. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా సేవలందించారు. సౌత్ కాలిఫోర్నియా గవర్నర్గా నియమితురాలైన తొలి మహిళగా ఆమె రికార్డు సాధించారు. రెండేండ్ల క్రితం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2024 అధ్యక్ష ఎన్నికల్లో తన మాజీ బాస్తో పోటీ పడబోనని ప్రకటించిన సంగతిని అంతా గుర్తు చేస్తున్నారు.
నిక్కీ హేలీ అసలు పేరు నిర్మతా నిక్కీ రాంధావా. ఆమె భారత సంతతి దంపతులకు జన్మించారు. 2004లో తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించారు. 2008లో రెండోసారి గెలుపొందారు. 2010లో కాలిఫోర్నియా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక ప్రకటన చేయకున్నా, డెమొక్రాటిక్ పార్టీ తరఫున 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని సంకేతాలిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీలో ఆయన ప్రత్యర్థులెవరు అన్న సంగతి తేలలేదు. కానీ జో బైడెన్కు తక్కువ రేటింగ్ వస్తున్నది.
మరోవైపు వివాదాలకు మారుపేరుగా నిలిచిన డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు తక్కువ అని కన్జర్వేటివ్లు అంటున్నారు. 2020 ఎన్నికల్లో ఓటమి పాలైనా క్యాపిటల్ హిల్స్ పైకి తన అభిమానులను రెచ్చగొట్టారన్న విమర్శలు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ కు బాధ్యతలు అప్పగించేందుకు అంగీకరించలేదు. ఫలితంగా సోషల్ మీడియా సంస్థలు.. ట్రంప్ ఖాతాలను సస్పెండ్ చేశాయి.