న్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్కు తమ వంతు సాయాన్ని అందించడానికి పలు దేశాలు ముందుకొచ్చాయి. వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్రే మెషిన్లు, పీపీఈ కిట్లను అందజేయనున్నట్టు పొరుగు దేశం పాకిస్థాన్ ప్రకటించింది. 80 మెట్రిక్ టన్నుల ద్రవ రూప ఆక్సిజన్ను పంపిస్తున్నట్టు సౌదీ ఆరేబియా తెలిపింది. 600 వైద్య పరికరాలను పంపిస్తున్నట్టు బ్రిటన్ వెల్లడించింది. ఇందులో వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డివైజ్లు ఉన్నట్టు వివరించింది. భారత్కు మందులు, వైద్య సామగ్రితో పాటు ఆక్సిజన్ను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు యురోపియన్ యూనియన్ (ఈయూ) ఒక ప్రకటనలో పేర్కొంది. సింగపూర్ నుంచి భారత్కు ఇప్పటికే నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. భారత్కు త్వరలో వైద్య సామగ్రి అందజేస్తామని జర్మనీ తెలిపింది. వైరస్ నియంత్రణలో భారత్కు తగిన సాయం అందిస్తామని ఆఫ్ఘనిస్థాన్, ఫ్రాన్స్ కూడా ప్రకటించాయి.
భారత్లో టీకా ఉత్పత్తికి కావాల్సిన ముడిపదార్థాలను అమెరికా ఎగుమతి చేయడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకొన్నది. భారత్లో కొవిషీల్డ్ ఉత్పత్తిని పెంచడానికి కావాల్సిన ముడిపదార్థాలతో పాటు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లను కూడా పంపిస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ తెలిపారు. భారత్కు అదనపు సాయం చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ట్వీట్ చేశారు. దీనికి ముందు భారత్కు సాయం చేయాలని పలువురు అమెరికా చట్టసభ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. వ్యాక్సిన్ నిల్వలను అమెరికా దాచుకోవడం సరికాదని ఇండియన్ అమెరికన్ రాజా కృష్ణమూర్తి విమర్శించారు.