టెహ్రాన్, జూలై 5 : అమెరికా దాడుల్లో అమరుడైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరు అయినప్పటికీ, ఆయన కుమారుడు, వారసుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత ఇరాన్ చీఫ్ మొజ్తబా ఖమేనీ మాత్రం కడపటి చూపునకు రాలేదు. అయితే ఆదివారం టెహ్రాన్లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనలకు ఖమేనీ మిగిలిన ముగ్గురు కుమారులు మాత్రం హాజరయ్యారు. ఖమేనీ మృతితో ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తబా గైర్హాజరు పట్ల తాజాగా ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఆరోగ్య స్థితి ఎలా ఉంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చీఫ్గా ఎన్నికైన తర్వాత ఎన్నడూ మొజ్తబా ఖమేనీ బహిరంగ కార్యక్రమాల్లో కన్పించ లేదు. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మైసల్లాలో అంత్యక్రియల ప్రార్థనల సమయంలో తమ తండ్రి శవపేటిక వెనుక ముగ్గురు కుమారులు మొస్తాఫా, మేసమ్, మాసూద్ ఖమేనీలు నిలుచుని ఉన్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. మసూద్ ఖమేనీ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్టు కన్పించింది. ఈ ప్రార్థనల్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబఫ్, ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్ వాహిది తదితరులు పాల్గొన్నారు.