న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం గ్రూప్ ఆఫ్ సెవన్(జీ7)పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీ7 వాటా క్షీణించడాన్ని, పెరుగుతున్న బ్రిక్స్ ఆర్థిక ప్రాబల్యాన్ని ఆయన సరిపోల్చా రు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ వ్యాపార సదస్సును ఉద్దేశించి పుతిన్ ప్రసంగిస్తూ ప్రపంచ జీడీపీలో జీ7 దేశాల వాటా సుమారు 29 శాతం మాత్రమే ఉండగా బ్రిక్స్ సభ్య దేశాల వాటా దాదాపు 40 శాతం ఉందని అన్నారు. 2014లో క్రిమియాను విలీనం చేసుకున్న తర్వాత బహిష్కరణకు గురయ్యే వరకు రష్యా అప్పటి జీ8లో సభ్యదేశంగా ఉండేది. ఆ తర్వాత ఆ కూటమి తిరిగి జీ7గా మారింది. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో ఆర్థిక వృద్ధికి నాయకత్వం వహించిన దేశాల స్థానాన్ని క్రమంగా కొత్త వృద్ధి కేంద్రాలు ఆక్రమిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారుతున్నదని పుతిన్ చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచం నిర్మాణాత్మకమైన, లోతైన, అత్యంత కీలకమైన మార్పులకు లోనవుతున్నదని ఆయన అన్నారు. బలమైన ఆర్థిక శక్తులు ఇప్పటికీ కీలకమైన మౌలిక సదుపాయాలను, సాంకేతికత, శాస్త్రీయ పరిశోధనల్లో ఆధిక్యాన్ని కలిగి ఉన్నాయని అంగీకరించారు. అయితే ప్రపంచ ఆర్థిక నాయకత్వంలో మార్పులు అనివార్యమని ఆయన తెలిపారు. ప్రపం చ ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న సహకారాన్ని పెరుగుతున్న సభ్య దేశాల ప్రభావానికి నిదర్శనంగా పేర్కొంటూ బ్రిక్స్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక కూటమిగా అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారుతున్న నేపథ్యంలో ఈ కూటమి తన పరిధికి వెలుపలి దేశాలకు కూడా ద్వారాలు తెరిచి ఉంచిందని ఆయన పేర్కొన్నారు. అలాగే సభ్య దేశాల మధ్య మరింత బలమైన సహకారం ఉండాలని పిలుపునిచ్చారు. జీ7 తనను తాను గొప్ప ఆర్థిక శక్తిగా ఎందుకు అభివర్ణించుకుంటున్నదో తనకు అర్థం కావడం లేదని కూడా పుతిన్ వ్యాఖ్యానించారు.
పోటీదారులను బలహీనపరచడం ద్వారా పాశ్చాత్య దేశాలు తమ ఆర్థిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కొన్నిసార్లు పోటీ వికృత రూపాలను దాల్చుతుంది. రాజ్యం, ప్రభుత్వ స్థాయిలలో కూడా మనం దీనిని చూస్తుంటాం అని ఆయన చెప్పారు. పైప్లైన్ల ధ్వంసం, అంతర్జాతీయ రవాణా కారిడార్లను అడ్డుకునే ప్రయత్నాలు, నౌకల స్వాధీనం, చట్టవిరుద్ధమైన ఆంక్షల విధింపు వంటి చర్యలు ఇందులో ఉన్నాయని ఆయన అన్నారు. తమ స్వీయ ఆర్థిక ప్రయోజనాలను కొనసాగించే దేశాలపై అదనపు ఆంక్షలను ఉపయోగించడాన్ని ఆయన విమర్శించారు. రష్యాపై 30,000కు పైగా ఆంక్షలు విధించారు. ఇది ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నింటిపైనా కలిపి విధించిన ఆంక్షల సంఖ్యకు రెట్టింపు అని ఆయన పేర్కొన్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా తన సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేసుకుందని, విశ్వసనీయమైన, ఊహించదగిన భాగస్వాములతో సంబంధాలను విస్తరించుకుందని, ఆర్థిక వృద్ధిని కొనసాగించిందని పుతిన్ అన్నారు. గత మూడేండ్లుగా రష్యాలో ఆర్థిక వృద్ధి ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
అంతకుముందు, భారత్ మండపంలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్తో దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా వెలుపల జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్పులో పుతిన్ స్వయంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఏడాది మోదీ, పుతిన్ మధ్య జరిగిన రెండవ సమావేశం కూడా ఇదే. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి చర్చలు, దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అలాగే శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాలలో సహకారంతోపాటు నైపుణ్యం కలిగిన వారి రాకపోకలు, ప్రజల మధ్య సంబంధాలపై ఇద్దరు నాయకులు సమీక్ష జరిపారు. భారత్ సారథ్యంలో బ్రిక్స్ 2026లో అంతర్గత సహకారాన్ని మోదీ, పుతిన్ సమీక్షించారు. భారత్-రష్యా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి వారు అంగీకరించారు.