మాస్కో : ఉక్రెయిన్ శాంతి చర్చలను నిలిపివేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శుక్రవారం ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన పరిష్కారాల అన్వేషణకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు నిరాటంకంగా సాగుతున్నాయి. పలు నగరాలు, పట్టణాలపై రష్యా బలగాలు కాల్పులతో విరుచుకుపడుతున్నాయి.
జనావాసాలనూ రష్యన్ సేనలు లక్ష్యంగా చేసుకుంటుండటంతో పౌరులు భయాందోళనతో ఆయా ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. రష్యా దాడుల్లో తూర్పు ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. ఖర్ఖీవ్లోని ఓ బహుళ అంతస్తుల టీచింగ్ భవనంపై కాల్పులు జరిగాయని తెలిపింది.
క్రమటోస్క్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా ఆరుగురు గాయపడ్డారని గవర్నర్ పాలో క్రిలెంకో ఆన్లైన్ పోస్ట్లో వెల్లడించారు. రష్యా బలగాల కాల్పుల హోరుతో పలు పట్టణాలు, గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించే ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఉక్రెయిన్ తూర్పు లుహంక్ ప్రాంత గవర్నర్ పేర్కొన్నారు.