లాహోర్: ఈ రోజుల్లో ఏ రాష్ట్రంలోనైనా రోజుకు నాలుగైదు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణమైంది. ఒక్కోరోజు 10 నుంచి 20 రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతకుమించి రోడ్డు ప్రమాదాలు జరుగడం అనేది అత్యంత అరుదు. కానీ పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఒక్కరోజే భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అంటే పదో, ఇరవైయ్యో, వందో, రెండు వందలో కాదు.. ఏకంగా వెయ్యి ప్రమాదాలు జరిగాయి.
అయితే, ఇన్ని ప్రమాదాలు జరిగినా కేవలం 11 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోవడం సంతోషకరమైన విషయం. మొత్తం 1016 మంది గాయపడ్డారు. వారిలో 576 మందికి తీవ్ర గాయాలుకాగా, 440 మంది స్వల్పగాయాలతో ప్రమాదాల నుంచి బయటపడ్డారు. బాధితుల్లో 425 మంది డ్రైవర్లు (వీళ్లలో 46 మంది డ్రైవింగ్ చేసే వయసు లేనివాళ్లే), 136 మంది పాదచారులు, 466 మంది ప్రయాణికులు ఉన్నారు. పంజాబ్ రాజధాని లాహోర్లో అత్యధికంగా 222 రోడ్డు ప్రమాదాలు 220 మందిని బాధితులుగా మార్చాయి.
ఆ తర్వాత ముల్తాన్, ఫైసలాబాద్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ముల్తాన్లో 78 రోడ్డు ప్రమాదాల్లో 74 మంది బాధితులయ్యారు. ఫైసలాబాద్లో 72 రోడ్డు ప్రమాదాల్లో 76 మంది బాధితులుగా మారారు. ఇటీవల పంజాబ్ ప్రావిన్స్లో దట్టమైన పొగమంచు కమ్ముతున్నది. దాంతో దగ్గరికి వచ్చేవరకు కూడా ఎదుటి వాహనాలు కనిపించడం లేదు. భారీ సంఖ్యలో ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం. దీనికి తోడు వాహనాల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, రోడ్లు అధ్వాన్నంగా ఉండటం, రోడ్డు భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి.