Hijab protests @ 100 days | ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు 100 వ రోజుకు చేరాయి. మహిళలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు నిరసనకారులకు మద్దతుగా రోడ్లపైకి వస్తున్నారు. ఆందోళనాకారులను ఎక్కడికక్కడ ప్రభుత్వం అణిచివేస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 100 రోజుల తర్వాత కూడా ఇరాన్లో ఆదివారం పలు చోట్ల ప్రదర్శనలు జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలు పోయినా ప్రభుత్వానికి తలవంచేది లేదని మహిళలు చెప్తున్నారు. వివిధ వర్గాల నుంచి అందుతున్న మద్దుతుతో మహిళలు మరింత ఉద్ధృతంగా తమ నిరసనలు తెలుపుతున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో అత్యంత సుదీర్ఘ ప్రదర్శన ఇదే కావడం విశేషం. గత ఐదేండ్ల కాలంలో రెండు ప్రదర్శనలు జరగ్గా.. వాటిని ప్రభుత్వం అణిచివేసింది.
ఇరాన్లో హిజాబ్ ధరించాల్సిందేనంటూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో మహిళలు గత 100 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. వీరికి న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. అక్టోబర్ 17న ప్రదర్శన సందర్భంగా హిజాబ్ను తీసివేసిన 25 ఏండ్ల మహిళ మహసా పైరవికి ఇరాన్ రివల్యూషనరీ కోర్టులోని 15వ బెంచ్ 10 ఏండ్ల జైలు శిక్ష విధించింది. బెంచ్ అధిపతి అబోల్కాసెమ్ సలావతిని మానవ హక్కుల కార్యకర్తలు ‘ఇరాన్లో ఉరితీత న్యాయమూర్తి’గా అభివర్ణిస్తున్నారు.
మరోవైపు ఇరాన్ మోరల్ పోలీసింగ్ను వ్యతిరేకిస్తున్న బ్రిటన్, ఉక్రెయిన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఏడుగురిని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అరెస్టు చేశారు. వీరు ఇరాన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నిరసనల్లో శతృదేశాల కుట్ర ఉన్నదని గతంలోనే ఇరాన్ ప్రభుత్వం ఆరోపించింది. నిరసనకారులు అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి శతృదేశాలలో సైనిక శిక్షణ పొందారని, ఈ కారణంగానే హింసతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని అక్కడి ప్రభుత్వం మండిపడుతున్నది. అరెస్టయిన బ్రిటన్, ఉక్రెయిన్కు చెందిన ఏడుగురు తమ దేశాల తరఫున ఇక్కడ కుట్రపన్నుతున్నట్లు రుజువైందని ఇరాన్ ప్రభుత్వం పేర్కొన్నది. మరోవైపు, అరెస్టు చేసిన వ్యక్తుల గురించి ఇరాన్ నుంచి నివేదిక కోరినట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.