Iran : మోరల్ పోలీసింగ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో ఇరాన్ ప్రభుత్వం దిగొచ్చింది. మోరల్ పోలీసింగ్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మొంతజెరి శనివారం వెల్లడించాడు. ఇరాన్ పార్లమెంట్, న్యాయ వ్యవస్థ కూడా ఏండ్ల నాటి హిజాబ్ చట్టాన్ని పరిశీలిస్తున్నాయని, ఈ చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? అనే విషయమై ఆలోచిస్తున్నాయని ఆయన తెలిపాడు. దాంతో, దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహిసా అమిని మోరల్ పోలీసుల కస్టడీలో చనిపోవడంతో హిజాబ్ వివాదం రాజుకుంది. ఆమె మరణ వార్త తెలిసి ఆగ్రహించిన ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు. మహిసా అమిని ఫొటో, ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీదికి వచ్చారు. మోరల్ పోలిసింగ్ను నిరసిస్తూ కొందరు మహిళలు జుట్టు కత్తిరించుకున్నారు. ఆ వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు కొందరు హిజాబ్ లేకుండానే బహిరంగ ప్రదేశాల్లో తిరిగారు. ఆ దేశ ఫుట్బాల్ ఆటగాళ్లు, అథ్లెట్లు ప్రపంచ వేదిక మీద నిరసనకారులకు సంఘీభావం తెలియజేశారు.
సంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్లో మహిళలపై ఆంక్షలు చాలా ఎక్కువ. వాళ్ల డ్రెస్ కోడ్పై మోరల్ పోలీసుల నిఘా ఉంటుంది. హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో మహిసాను సెప్టెంబర్ 20వ తేదీన మోరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాళ్ల కస్టడీలో చనిపోయింది. దాంతో ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 నెలలుగా హిజాబ్, మోరల్ పోలీసింగ్ వ్యతిరేక నినాదాలు, నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఇప్పటివరకూ ఈ నిరసన ప్రదర్శనల కారణంగా దాదాపు 300 మంది పౌరులు చనిపోయారు. ఇరాన్లో 1979 విప్లవం తర్వాత ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం మోరల్ పోలీసింగ్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.