లండన్: అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి బ్రిటన్కు చెందిన ప్రిన్స్ చార్లెస్ ట్రస్ట్ మిలియన్ పౌండ్ల (రూ.9.64 కోట్ల) విరాళం స్వీకరించింది. బ్రిటన్ మీడియా సంస్థ ‘ది సండే టైమ్స్’ ఈ మేరకు ఒక కథనాన్ని ఆదివారం ప్రచురించింది. 2013లో లాడెన్ సోదరుడు షేక్ బకర్ బిన్ లాడెన్ను లండన్లో ప్రిన్స్ చార్లెస్ స్వయంగా కలిసి ఈ విరాళాన్ని స్వీకరించినట్లు పేర్కొంది. కాగా, ఆ విరాళాన్ని తిరిగి ఇచ్చేయమంటూ రాచరిక సలహాదారులు ఆయనకు సూచించినట్లు తెలిపింది.
అయితే లాడెన్ కుటుంబం నుంచి విరాళాలు స్వీకరించే నిర్ణయంలో ప్రిన్స్ చార్లెస్ వ్యక్తిగత ప్రమేయం ఉందన్న ఆరోపణలను అధికార క్లారెన్స్ హౌస్ కార్యాలయం ఖండించింది. ఈ విరాళాన్ని స్వీకరించడంలో పూర్తిగా శ్రద్ధ వహించినట్లు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ఫండ్ (పీడబ్ల్యూసీఎఫ్) హామీ ఇచ్చిందని క్లారెన్స్ హౌస్ ప్రతినిధి ‘స్కై న్యూస్’కు తెలిపారు. అలాగే విరాళం అంగీకరించాలనే నిర్ణయాన్ని స్వచ్ఛంద సంస్థ ధర్మకర్తల ద్వారా తీసుకున్నారని చెప్పారు. దీనిని వేరే విధంగా వర్గీకరించడానికి చేసే ఏదైనా ప్రయత్నం తప్పని అన్నారు.
మరోవైపు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ఫండ్ (పీడబ్ల్యూసీఎఫ్) కూడా ఈ వార్తా కథనంపై స్పందించింది. 2013లో షేక్ బకర్ బిన్ లాడెన్ నుంచి అందిన విరాళాన్ని ట్రస్టీలు అన్ని విధాలా పరిశీలించారని తెలిపింది. ఆ నిధులకు సంబంధించి ప్రభుత్వంతో సహా అనేక మూలాధారాల నుంచి సమాచారం కోరడంతోపాటు స్వీకరణపై తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. దీని గురించి వస్తున్న ఆరోపణలు సరికాదని, తప్పుదారి పట్టించే ప్రయత్నమని ప్రిన్స్ చార్లెస్ ట్రస్ట్ పేర్కొంది.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన ఉగ్ర దాడిలో సుమారు 3000 మంది మరణించారు. అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ దీనికి సూత్రధారి అని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ నిర్ధారించింది. ఒసామా బిన్ లాడెన్ గురించి సమాచారం ఇచ్చిన వారికి 25 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2011 మే 2న పాకిస్థాన్లోని అబోటాబాద్లో నక్కిన లాడెన్ స్థావరంపై అమెరికా ప్రత్యేక దళాలు దాడి చేసి హతమార్చాయి.
కాగా, ఒసామా బిన్ లాడెన్ మరణించిన రెండేళ్ల తర్వాత, సౌదీ సంపన్న కుటుంబానికి చెందిన లాడెన్ సోదరుడు షేక్ బకర్ బిన్ లాడెన్తో ప్రిన్స్ చార్లెస్ సమావేశం జరిగినట్లు ‘ది సండే టైమ్స్’ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి విరాళాన్ని ప్రిన్స్ చార్లెస్ ట్రస్ట్ స్వీకరించిందని వెల్లడించింది.