ఇన్ని రోజుల పాటు నిత్యావసర ధరల పెరుగుదల, కరోనా, ఆర్థిక సంకటం… ఇలా పాక్ ప్రధాని ఇమ్రాన్కు నిద్రలేని రాత్రులు మిగిల్చాయి. కాస్త కోలుకుంటున్నామన్న తరుణంలో మరో సంకటం వచ్చి పడింది. ప్రధాని ఇమ్రాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి. పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 సీట్లున్నాయి. సర్కార్ను ఏర్పాటు చేయాలంటే 177 సీట్లు కావాలి. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గర 156 సీట్లున్నాయి. అందునా.. మద్దతిచ్చే పార్టీలను కలుపుకొనే. ఇప్పుడు ఈ పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తే.. ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలినట్టే. లెక్క ప్రకారం పాక్లో 2023లో ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే తిరిగి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అంటే సంశయమే. గతంలోనే ప్రభుత్వ ఏర్పాటులో దాదాపుగా 20 సీట్లు తక్కువయ్యాయి. అతి కష్టం మీద ఇతరుల మద్దతుతో ఇమ్రాన్ మిత్రపక్షాల మద్దతు కూడగట్టి, ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
గత యేడాదిలోనూ అవిశ్వాస పరీక్షే
2021 లోనూ ప్రధాని ఇమ్రాన్ అవిశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. ఇందులో ఆయనకు 178 ఓట్లు వచ్చాయి. అయితే ఈ సమయంలో సభ బయట పెద్ద ఎత్తున గలాట జరిగింది. ముస్లిం లీగ్ నేత మరియం నవాజ్పై ఇమ్రాన్ మద్దతు దారులు దాడికి దిగారు. అయితే అవిశ్వాస పరీక్ష గట్టెక్కాంటే ఇమ్రాన్కు 172 సీట్లు కావాలి. మిత్రపక్షాలు మద్దతివ్వడంతో ఇమ్రాన్ సర్కార్కు 178 ఓట్లు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ విజయం సాధించారు.
రష్యా పర్యటనకు ప్రధాని ఇమ్రాన్
పాక్ ప్రధాని ఇమ్రాన్ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పాక్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24,25 తేదీల్లో ఇమ్రాన్ రష్యాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అవుతారు. అయితే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, రష్యా పర్యటన రద్దవుతుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.