లండన్, అక్టోబర్ 20: బ్రిటన్లో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తింది. తన విధానాలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న లిజ్ ట్రస్ అనూహ్యంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. గురువారం నంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆమె మాట్లాడుతూ.. తనపై పార్టీ విశ్వాసం కోల్పోయిందని, చేసిన వాగ్దానాలను తాను నెరవేర్చలేకపోయానన్నారు. తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు మార్కెట్లను అతలాకుతలం చేసినందుకు బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొనసాగుతానని తెలిపారు.
ప్రధానిగా ట్రస్ తీసుకొన్న పలు పాలనాపరమైన నిర్ణయాలు బ్రిటన్ను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. పన్ను కోతలపై సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ వల్ల మార్కెట్లు కుదేలయ్యాయి. డాలర్తో పోల్చితే పౌండ్ విలువ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. సామాన్యులతో పాటు ధనవంతులకు కూడా ఇంధన పన్ను తగ్గిస్తూ తీసుకొన్న నిర్ణయంపై సొంత పార్టీ ఎంపీల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని ట్రస్ ప్రకటించినా.. అది ఆచరణలో సాధ్యం కాలేదు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయారు. తనఖా రేట్లు భారీగా పెరిగిపోయాయి.
బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ డెట్ మార్కెట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మినీ బడ్జెట్ ప్రకటనకు ముందే ఆర్థిక శాఖలోని ముఖ్య అధికారులను క్వాసీ క్వార్టెంగ్ తొలగించటం ప్రభావం చూపింది. ఆ దెబ్బకు క్వాసీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రస్ వంతు వచ్చింది. కాగా, ట్రస్ రాజీనామా నిర్ణయం తర్వాత పౌండ్ విలువ 1.13 డాలర్లు (0.36 శాతం పెరిగినట్టు తెలిసింది.
దేశంలో పరిస్థితిపై ఎంపీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో వారికి జవాబిచ్చేందుకు బుధవారం ట్రస్ పార్లమెంట్కు వచ్చారు. ఆ సమయంలో కొందరు ఎంపీలు ట్రస్ రాజీనామాకు డిమాండ్ చేశారు. అటు.. ఈ నెల 24లోగా ట్రస్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని 100 మంది సొంత పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు తెలిసింది. దానికి ముందే ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు.
బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత జరిగిన కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో రిషి సునాక్పై విజయం సాధించి ట్రస్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అయితే 45 రోజులే ఆమె పదవిలో కొనసాగారు. ఆ 45 రోజుల్లో ఎన్నో మలుపులు చోటుచేసుకొన్నాయి. పన్ను కోతపై ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. మార్కెట్లు కుప్పకూలాయి. కరెన్సీ విలువ తగ్గిపోయింది. దీంతో ఆర్థిక మంత్రిగా క్వాసీ క్వార్టెంగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత వారంలోపే హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ కూడా పదవి నుంచి వైదొలిగారు. తాజాగా, ట్రస్ గద్దె దిగారు. దేశంలో రాజకీయ సంక్షోభాన్ని నివారించాలంటే వెంటనే సాధారణ ఎన్నికలు అవసరమని లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ అన్నారు. కన్జర్వేటివ్ పార్టీకి పాలించే అర్హత లేదని తెలిపారు.
యూకే చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్ ట్రస్ నిలిచారు. గత నెల 22న బాధ్యతలు చేపట్టిన ఆమె, 45 రోజులే పదవిలో ఉన్నారు. 2016లో బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత యూకేలో నలుగురు ప్రధానులు మారారు.
వారంలో కొత్త ప్రధాని ఎంపిక ఉంటుందని కన్జర్వేటివ్ పార్టీ స్పెషల్ రూల్ కమిటీ, 1922 చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీ తెలిపారు. ఈ నెల 28లోగా ప్రధాని అభ్యర్థిని ఎన్నుకొంటామని వెల్లడించారు. అయితే, ప్రధానిగా భారత సంతతి నేత రిషి సునాక్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్టు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. కాకపోతే బోరిస్ జాన్సన్ మళ్లీ రావాలని ఆయన మద్దతుదారులు కోరుతున్నారు. వీరిద్దరితో పాటు పెన్నీ మోర్డౌంట్, సుయెల్లా బ్రేవర్మన్, కెమి బడేనోచ్, బ్రాండన్ లూయిస్ ప్రధాని రేసులో ఉన్నారని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.