ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అక్కడ ఉన్న మతువ తెగలతో ఇవాళ మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ మతువ తెగ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, బంగ్లాదేశ్ ప్రగతి సాధించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం, ప్రేమ, శాంతిని రెండు దేశాలు కాంక్షిస్తున్నాయన్నారు. అస్థిరత్వం, ఉగ్రవాదం, అసహనానికి వ్యతిరేకంగా రెండు దేశాలు పోరాడుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రెండు దేశాలు తమ సామర్థ్యాన్ని నిరూపించాయన్నారు. మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాయని, కలిసికట్టుగా పోరాడుతున్నట్లు చెప్పారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు బంగ్లాదేశ్కు చేరినట్లు మోదీ తెలిపారు.
ప్రధాని మోదీ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని, దాని పట్ల గర్వంగా ఫీలవుతున్నామని మతువ తెగకు చెందిన ప్రజలు తెలిపారు. మతువ కమ్యూనిటీ మొత్తం ఆనందంలో తేలిపోతోందని ఆ వర్గ ప్రతినిధి మింటూ బిశ్వాస్ తెలిపారు. మోదీకి ఆహ్వానం పంపిన ప్రధాని షేక్ హసీనాకు థ్యాంక్స్ చెప్పారు. మతువ కులస్థులు హిందూ మతానికి చెందినవారే. శూద్ర వర్ణానికి చెందిన వీరిని ఎస్సీలుగా గుర్తిస్తారు. బంగ్లాదేశ్లోని ఓరాకండిలో ఈ తెగవకు చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది.